అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రేమ వివాహంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

  • బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లాడిన దళిత ఎమ్మెల్యే
  • ఆత్మహత్యాయత్నం చేసిన యువతి తండ్రి
  • ఆపై హైకోర్టులో పిటిషన్
  • ఎమ్మెల్యే తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ ఆరోపణ
అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు ఇటీవల ప్రేమ వివాహం చేసుకోవడం తెలిసిందే. దళిత వర్గానికి చెందిన ప్రభు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సౌందర్య అనే యువతిని పెళ్లాడారు. అయితే ఈ పెళ్లిని సౌందర్య కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సౌందర్య తండ్రి స్వామినాథన్ ఎమ్మెల్యే ప్రభు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అనంతరం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

తన కుమార్తెను ఎమ్మెల్యే ప్రభు అపహరించాడని, బెదిరించి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. ఈ పిటిషన్ ను విచారణకు చేపట్టిన న్యాయస్థానం సౌందర్యను అడిగి వివరాలు తెలుసుకుంది. ఆమె తండ్రి స్వామినాథన్ చేసిన ఆరోపణలు నిజమేనా అని ప్రశ్నించగా, తనను ఎవరూ అపహరించలేదని, బెదిరించలేదని వివరించింది. తాను ప్రభును ప్రేమించానని, అతడిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని సౌందర్య స్పష్టం చేసింది.

సౌందర్య స్వయంగా చెప్పడంతో హైకోర్టు స్వామినాథన్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇద్దరూ మేజర్లేనని, ఎమ్మెల్యే ప్రభు-సౌందర్య ప్రేమవివాహం చెల్లుతుందని తీర్పు ఇచ్చింది.

Prabhu
Soundarya
Madras High Court
Love Marriage
AIADMK
Tamilnadu

More Telugu News